శ్లోకాలు జపించడంలో పూజారుల మధ్య వాగ్వాదం

వైష్ణవ శాఖకు చెందిన రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన ఘటన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో వైష్ణవ భక్తులైన తెంకలై, వడకలై వర్గాల మధ్య శ్లోకాలు జపించడంలో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పెరుమాళ్ ఆలయం 8 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలో తిరువేది పురం ఉత్సవం నిర్వహించారు. ఆచారం ప్రకారం తెంకలై శాఖ భక్తులు శ్రీ మహా విష్ణువును స్తుతిస్తూ అజ్వర్లు రాసి, పాడిన నలైరా దివ్య ప్రబంధం(4,000 తమిళ శ్లోకాల సంకలనం) పఠించడం ప్రారంభించారు. కానీ వడకలై వర్గం ఇందుకు అభ్యంతరం తెలిపింది. ఆ ప్రబంధాన్ని పఠించడం తమకు వ్యతిరేకమని గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.
దీనిపై తెంకలై బృందం.. వడకలై సభ్యులు తమను కిందికి నెట్టారని ఆరోపిస్తూ విష్ణుకాంచీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ ముగిసింది.

0 comments: